Nara Lokesh Yuvagalam Padayatra

పెనుకొండలో విజయవంతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర అప్యాయంగా పలకరిస్తూ… నేనున్నానని భరోసా ఇస్తున్న యువనేత లోకేష్ కు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న కేశవ్, బిటి నాయుడు బాబుగారివల్లే ఉద్యోగాలు వచ్చాయన్న కియా అనుబంధ ఉద్యోగులు

పెనుకొండ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో విజయవంతం సాగింది.  53వరోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి క్యాంపు సైట్ నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైంది. గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో యువనేతకు అభిమానులు, గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు. బాలన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులు పెద్దఎత్తున ఎదురేగి స్వాగతించారు. మల్లాపల్లిలో యువనేతను పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. రాగిమేకలపల్లి వద్ద మహిళలు, వృద్ధులను యువనేత ఆప్యాయంగా పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నారు. మల్లాపల్లి వద్ద ఓ వేరుశనగ రైతు యువనేతను కలిసి తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. పాలసముద్రం వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. పాలసముద్రం భోజన విరామ స్థలం వద్ద బీసీలతో ముఖాముఖి నిర్వహించిన యువనేత వారి సాదకబాధలు తెలుసుకున్నారు. భోజన విరామానంతరం పాలసముద్రం వద్ద యువనేతకు మహిళలు హారతులివ్వగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. యువనేత పాదయాత్రకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బిటి నాయుడు సంఘీభావం తెలిపారు. బెల్లాల చెరువు రోడ్డు వద్ద యువనేతకు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు. పాలసముద్రం సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో కియా అనుబంధ సంస్థల వద్ద సుమారు 500మంది ఉద్యోగులు హైవే రోడ్డు మీదకు వచ్చి యువనేత పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు గారి చలవవల్లే మంచి జీతంతో ఉద్యోగాలు చేయగలుతున్నామని అక్కడి ఉద్యోగులు చెప్పినపుడు యువనేత ఆనందంతో పొంగిపోయారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు యువనేతతో ఫోటోలు దిగారు.

యువనేత పాదయాత్రలో వ్యక్తమైన అభిప్రాయాలు:

పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియడం లేదు! – వసంతరావు, మల్లాపల్లి, రిటైర్డ్ ఉద్యోగి

నేను డిప్యూటీ తహశీల్దార్ గా 2005లో రిటైర్డ్ అయ్యా. అప్పటి నుండి నా పెన్షన్ ఏనాడూ ఆగలేదు. కానీ రెండేళ్ల క్రితం నుండి ఎప్పుడు పడుతుందో తెలీదు. ప్రతిసారి అకౌంట్ చెక్ చేసుకుని ఉసూరుమని కూర్చునేవాన్ని. చంద్రబాబు ఉన్నప్పుడే కచ్ఛితంగా 1వ తేదీనే నా పెన్షన్ డబ్బులు పడేవి. వైసీపీ వచ్చాక పెన్షన్లు కూడా ఆపేస్తారు అనే అనుమానం కలిగేది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.

అభయహస్తం డబ్బు వాడేసుకున్నారు – ఎమ్.జె.వెంకమ్మ, వృద్ధురాలు, మల్లాపల్లి

నేను డ్వాక్రాలో ఉన్నప్పుడు అభయహస్తం కింద రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.4వేలు కట్టా. డ్వాక్రాలో ఉండి, 60 ఏళ్లు నిండిన నెలకు వారికి రూ.500 చొప్పున పెన్సన్ రావాల్సి చెల్లించాలి. కానీ మా అభయహస్తం డబ్బులు ఈ ప్రభుత్వం వాడేసుకుంది. కనీసం పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. మేము చెల్లించిన అభయహస్తం డబ్బులు కూడా చెల్లించలేదు.

సీబీఎన్ కియా విజ‌న్‌..నిజ‌మైందిలా…! – కియా అనుబంధ‌సంస్థ‌ల వ‌ద్ద నారా లోకేష్ సెల్ఫీ ఆనందం

క‌ళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు..థిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు దునియా మొత్తం చూసేశారు. ఆ దూర‌దృష్టి నుంచి వ‌చ్చే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు కాబ‌ట్టే ఆయ‌న‌ని దార్శనికుడు అని అంటారు. చంద్రబాబు ఎన్నో వ్యయ‌ప్రయాస‌ల‌కోర్చి కియాని తీసుకొచ్చిన‌ప్పుడు, క‌మీష‌న్ల కోసం తెచ్చార‌ని వైసీపీ నేత‌లు ఆరోపించారు. కార్లు అమ్ముడుపోని కంపెనీని తెచ్చి ఏం చేస్తార‌ని హేళ‌న చేశారు. అన‌తికాలంలోనే కియాలో త‌యారైన కార్లు దేశ‌మంతా దూసుకుపోతున్నాయి. కియా అనుబంధసంస్థలు వేల‌సంఖ్యలో యువ‌త‌కి ఉద్యోగాలు క‌ల్పిస్తున్నాయి. థిమాక్ ఉన్న చంద్రబాబు దునియా చూసి తెచ్చిన కియా కంపెనీ ఫ‌లాలు రాష్ట్రానికి అందుతున్నాయి. కియాని విమ‌ర్శించిన వైసీపీ నోర్లే, కియా త‌మ మ‌హామేత లేఖ రాయ‌డం వ‌ల్ల వ‌చ్చింద‌ని ఓ ఫేక్ ఉత్తరం సృష్టించి అసెంబ్లీలో చ‌దివి అల్పసంతోషం మిగుల్చుకున్నారు. కానీ కియా తెచ్చింది చంద్రబాబు అని, టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో వ‌చ్చింద‌ని అంద‌రికీ తెలుసు. టిడిపి యువ‌నేత Nara Lokesh యువ‌గ‌ళం పాద‌యాత్ర పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌సముద్రం పంచాయ‌తీలో ఉన్న కియా అనుబంధ సంస్థల మీదుగా సాగింది. వంద‌లాది ఉద్యోగులు త‌న‌కి ఎదురుప‌డ‌టంతో వారితో మాట్లాడిన లోకేష్ త‌మ క‌ష్టానికి త‌గిన ప్రతిఫ‌లం యువ‌తకి ఉద్యోగ ఉపాధి రూపంలో దొరికిందని ఆనందంతో ఉప్పొంగిపోయారు. కియా అనుబంధ సంస్థల‌లో ఉద్యోగం చేస్తున్న ప‌ద్మావ‌తి అనే సోద‌రి లోకేష్‌తో పాటు కొద్దిదూరంలో పాద‌యాత్రలో న‌డిచింది. త‌మ‌కు స్థానికంగా ఉద్యోగాలు క‌ల్పించిన  కియా తీసుకొచ్చినందుకు చంద్రబాబు గారికి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

చంద్రబాబు చలవవల్లే మంచి ఉద్యోగం – యుగంధర్, తిరుపతి

నేను కేఈఎస్ఎం ఇండస్ట్రీలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా జీతం రూ.50వేలు. నా సొంత ఊరు తిరుపతి. ఇంత దగ్గర ప్రాంతంలో ఉద్యోగం చేసి ఇంత పెద్ద జీతం తీసుకుంటానని అనుకోలేదు. ఇక్కడికి పరిశ్రమలు రాకుండా ఉంటే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇంత జీతం వచ్చేది కాదు. అంతా చంద్రబాబుగారి చలవే. మా కంపెనీలో 234మంది ఉద్యోగాలు చేస్తున్నారు. నేను స్థానికంగా ఉద్యోగం చేయడం వల్ల వీక్లీ ఆఫ్ వచ్చినప్పుడు త్వరగా మా ఇంటికి వెళ్లి కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు అవకాశం ఉంది. చాలా సంతోషంగా ఉంది.

ఆనాడు పరిశ్రమలు తేబట్టే స్థానికంగా ఉద్యోగం – ఎన్.తిరుమలేశ్, హిందూపురం

ఊయాంగ్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. ప్రస్తుతం నాకు రూ.13వేలు జీతం వస్తోంది. ఇన్సెంటీవ్ వెయ్యి రూపాయలు వస్తుంది. ప్రతి ఆరు నెలలకు జీతం పెరుగుతోంది. రోజుకు 8గంటలు ఉద్యోగం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నా షిప్టు డ్యూటీ పూర్తయిన వెంటనే కంపెనీ బస్సులోనే ఇంటికి వెళ్లే సౌకర్యం ఉంది. కంపెనీలోనే భోజనం. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు హయాంలో పరిశ్రమ రాబట్టే ఇక్కడ ఉద్యోగం చేయగలుతున్నా…సంతోషంగా ఉంది.

బాబుగారి దయవల్లే స్థానికంగానే ఉద్యోగం – పద్మావతి, శివానగర్

ఆర్కే కాంక్రీట్ సైంటిఫిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. గ్యాస్ చెకింగ్ వింగ్ లో నా ఉద్యోగం. నాకు 8గంటల డ్యూటీ. నేను చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అయినా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. స్థానిక ప్రాంతంలోనే ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు గారి దయవల్లే మాలాంటి వాళ్లమంతా ఉద్యోగాలు చేసుకుంటున్నాం.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో బిసిలకు ఇచ్చిన హామీల అమలు! పవర్ లూమ్స్ కు 500, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రజకులకు వాషింగ్ మెషీన్లతో పాటు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు, నీరా కేఫ్ ల ఏర్పాటు బిసిల రక్షణకు తొలిఏడాదిలోనే ప్రత్యేక చట్టం తెస్తాం బిసిలతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్

పెనుకొండ: TDP అధికారంలోకి రాగానే బీసీలకు ఇచ్చిన హామీలను యేడాదిలోనే అమలు చేస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం క్రాస్ వద్ద బీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బిసిల పక్షపాత ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి ఒక్కో వర్గాన్ని నమిలేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆదరణ ద్వారా సుమారు వెయ్యి కోట్లు బీసీలకు ఖర్చు చేశాం. తుడా, టీటీడీ, ఆర్థిక మంత్రి లాంటి కీలక శాఖలు బీసీలకు ఇచ్చింది టీడీపీనే. సొంత మద్యం అమ్ముకునేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి గీతకార్మికులు కల్లు అమ్మకుండా పోలీసులతో వేధిస్తూ అడ్డుకుంటున్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ లు అమలుచేయడంతోపాటు నీరా కేఫ్ లు ఏర్పాటుచేస్తాం. చేనేతలకు పవర్ లూమ్ ఉన్నవాళ్లకు 500 యూనిట్లు విద్యుత్. మగ్గాలున్నవారికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తాం. ఆదరణ ద్వారా వాషింగ్ మిషన్లు ఇచ్చిన రజకులకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. షాపులు పెట్టుకునే వారికి రుణాలు కూడా ఇస్తాం. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక  6 లక్షల మందికి పెన్షన్లు తీసేశాడు..మరో 6 లక్షలు తీసేందుకు సిద్ధమయ్యాడు.  వైసిపి పాలనలో  ఏపీలో పేదరికం పెరిగింది. నాడు- నేడు ఎప్పుడైనా బీసీలకు అండగా ఉండేది టీడీపీనే. కియా సంస్థ ఇక్కడికి వస్తుంటే దొంగ సంస్థ అని జగన్ ఆనాడు విమర్శించారు. కియాకు ఇచ్చిన భూములు రైతులకు ఇప్పిస్తామని జగన్ అన్నారు.  కానీ కియాలో నేడు 25వేల మంది పని చేస్తున్నారు. కియా అనుంబంధ సంస్థలు వచ్చి ఉంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవి.

బిసిల రిజర్వేషన్ తగ్గించి తీరని ద్రోహం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ బీసీలకు 10 శాతం రిజర్వేషన్ తగ్గించడం వల్ల 16 వేల మంది బీసీలు పదవులు కోల్పోయారు. జగన్ సీఎం అయ్యాక 60 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ఉందా..ఒక్క రుణమైనా బీసీ సోదరులకు ఇచ్చారా.? డైరెక్టర్లు, చైర్మన్లకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. బీసీలపై ఈ ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగాయి. బీసీలపై 26వేల దొంగ కేసులు పెట్టారు. బీసీలకు టీడీపీ హామీ ఇస్తోంది..అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణకు చట్టం తీసుకొస్తాం. ఈ చట్టం ద్వారా బీసీల పట్ల అసభ్యంగా మాట్లాడినా, దాడి చేసినా, దొంగ కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో పోరాడేందుకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది.

రద్దుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం!

ఈ ప్రభుత్వం రద్దు చేసిన కార్పొరేషన్లను పునర్నిర్మాణ చేసి నిధులు కేటాయిస్తాం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు ఈ ప్రభుత్వం తొలగించిన పథకాలన్నీ ప్రవేశపెడతాం.  శాసనసభలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీ నేత అయిన అనురాధను ఎమ్మెల్సీగా గెలిపించారు. కానీ ఆమెను ఓడించేందుకు జగన్ వైసీపీ తరపున అభ్యర్థిని పెట్టారు. అధికారంలోకి వచ్చాక యేటా ఆదరణ పథకం అమలు చేస్తాం. నీరా కేఫ్ అమలు చేస్తాం. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం.  ఫీజు రీయింబర్స్ బీసీలకు ప్రవేశపెట్టింది చంద్రబాబే. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఆపలేదు.  బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు బీసీలకు ప్రవేశపెడితే దాన్ని రద్దు చేశారు. రేషనరైజేషన్ పేరుతో స్కూళ్లు మూయించి బీసీలకు విద్యను దూరం చేస్తున్నాడు.

బిసి రెసిడెన్షియల్ స్కూళ్లపై చర్చించి నిర్ణయం

ప్రత్యేకంగా బీసీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటును పార్టీ పెద్దలతో చర్చించి, మేనిఫెస్టోలో పెడతాం. టీడీపీ ప్రవేశపెట్టిన 130 సంక్షేమ కార్యక్రమాల్లో 100 కార్యక్రమాలను జగన్ రద్దు చేశారు. ఆర్థిక పరిస్థితిని బట్టి 45 ఏళ్లకే ఈడిగలకు పెన్షన్ విధానాన్ని నిర్ణయిస్తాం. వడ్డెర్లకు ఆనాడు ఎన్టీఆర్ క్వారీలు అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక లాక్కున్నారు. ఆ క్వారీలు తీసుకుని వడ్డెర సోదరులకు అప్పగిస్తాం. చట్టసభలకు వడ్డెర్లను పంపిస్తాం. ఇక్కడి ఎంపీ ఏనాడైనా బీసీల హక్కుల కోసం పార్లమెంట్ లో పోరాడారా.? వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలన్న అంశాన్ని ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. చిత్తశుద్ధితో వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కేంద్రం అడిగిన ప్రశ్నలకు మా ప్రభుత్వం సమాధానం కూడా చెప్పింది. కురుబలకు చెందిన  బంజరు భూముల్ని వైసీపీ నేతలు లాక్కుని రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ రాగానే అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూముల్ని కురబలకు అప్పగిస్తాం. చంద్రన్న బీమా ప్రవేశపెడతాం.

బీసీ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు

పురుషోత్తం, మడకశిర, ఈడిగ : మా కులంలో చాలామంది వెనకబడ్డారు. మాకు మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుంది. సొసైటీలో ఉన్నవారికి ఈత చెట్లు ఉన్నవారికి 10 ఎకరాల భూమి, టీఎఫ్టీ ఉన్నవాళ్లకు 5 ఎకరాలు భూమి కేటాయించాలి. ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం రెండింతలు చేయాలి. పట్టణాలు, గ్రామాల్లో గృహాలు లేవు. మాకు పక్కా గృహాలు కట్టించాలి.

గోపీనాథ్, పెనుగొండ : బీసీలకు ప్రత్యేకంగా హాస్టళ్లు, స్కూళ్లు ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యను మళ్లీ ప్రవేశపెట్టాలి.

గిరీష్ గౌడ్, రొద్దం : మద్యం దుకాణాల్లో గౌడలకు రిజర్వేషన్ కల్పించాలి.

శేషాద్రి, వడ్డెర : మా వాళ్లు ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనకబడ్డారు. ఎస్టీల్లో వడ్డెరలను చేర్చాలి. ప్రమాదాల్లో చనిపోతే గతంలో పరిహారం ఉండేది..కానీ ఇప్పుడు లేదు.

బేబీ, కురబ : మా వృత్తి గొర్రెల పెంపకం. అనంతపురం జిల్లాలో గొర్రెలు మేపే వారు ఎక్కువ. గొర్రెలు మేపు కునే వారికి బంజరు భూముల్లో షెడ్లు వేసుకోవడానికి గతంలో అనుమతులు వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో గోపాల మిత్రలు కూడా ఉండేవారు. కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ వచ్చాక షెడ్ల నిర్మాణాలకు రుణాలు విప్పించాలి.

సోమశేఖర్, సోమందేపల్లి : కల్లు అమ్ముకునే వారిపై పోలీసులను పంపి కేసులు పెడుతున్నారు. ఈడిగలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. కొద్దిమంది మాత్రమే రాజకీయంగా పైకొచ్చారు. చదువుకున్న వారికి కాలర్ షిప్ లలో నిబంధనలు పెడుతున్నారు. నీరా సెంటర్లు అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలి.

కృష్ణప్ప, చేనేత : గత ప్రభుత్వంలో ఎన్ని సమస్యలున్నా తీరిపోయేవి. 300 యూనిట్ల దాటితే పథకాలు కట్ చేస్తున్నారు. రేషన్ కార్డు చేస్తే సబ్సీడీలు కూడా రావు. నేరుగా బీమా ఉండేది. రేషన్ కార్డులు తీస్తే ఎలా జీవించాలి.

చిలమత్తూరుకు చెందిన వ్యక్తి: 2019లో జగన్ ను నమ్మి ఓట్లేశాం. చంద్రబాబును ఓడించినందుకు నిరుద్యోగిగా ఉండిపోయాం. వడ్డెర్లు కర్నాటకకు వలస పోతున్నారు. వడ్డెర్లు అనేక సమస్యల్లో ఉన్నారు. మా గొంతు వినిపించేందుకు చట్టసభల్లో వడ్డెర్లు లేరు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో వడ్డెర్లు ఎక్కువగా ఉన్నారు. మీ పక్కన కూర్చునే స్థాయి మా వడ్డెర్లకు కల్పించాలి. నూటికి ఒక్కరే చదువుకున్నవారు ఉన్నారు. సత్యపాల్ కమిటీ నివేదిక వైసీపీ తొక్కిపెట్టారు. వడ్డెర్లంతా ఐకమత్యంగా ఉన్నారు. చిలమత్తూరులో మా భూములు లాక్కున్నారు. నాకు చెందిన నాలుగు ఎకరాల భూమిని లాక్కున్నారు. లేపాక్షి భూములపై విచారణ వేయాలి. 8 వేల ఎకరాలు రైతులకైనా ఇవ్వాలి..లేదా పరిశ్రమలైనా స్థాపించాలి.

వాల్మీకీకి చెందిన వ్యక్తి : వాల్మీకీలు సీమ జిల్లాల్లో దీనంగా, హీనంగా ఉన్నారు. వాల్మీకీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. పెనుగొండలోనూ వాల్మీకీల ఓటు బ్యాంక్ అధికంగా ఉంది. వాల్మీకీలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలుగా ఉన్నారు..సీమ జిల్లాల్లో బీసీల్లో ఉన్నారు. మిలటరీ ల్యాండ్ లో బీసీ హాస్టల్ ఇంటర్ వరకూ చదివే వాళ్లకు నిర్మించాలి.

యాదవులకు అండగా నిలచింది టిడిపినే! గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం యాదవ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం యాదవులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

పెనుగొండ: యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా పెద్దపీట వేసింది టిడిపియేనని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. పెనుగొండ నియోజకవర్గం నల్లగొండ్రాయనిపల్లి లో యాదవ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… టిడిపి హయాంలో కేవలం యాదవుల కోసం రూ.250 కోట్లు ఖర్చు చేసాం. ఆర్ధిక శాఖ మంత్రి, టిటిడి ఛైర్మన్, తుడా ఛైర్మెన్, ఏపిఐఐసి ఛైర్మెన్ పదవులు యాదవులకు ఇచ్చింది టిడిపి. ఇప్పుడు ఆ పదవుల్లో ఎవరు ఉన్నారో యాదవ సోదరులు ఒక్క సారి ఆలోచించాలి. బిసిల పై వైసిపి అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. అందుకే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. టిడిపి హయాంలో 80 శాతం వీసి పదవులు బీసిలకు ఇచ్చాం. వైసీపీ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం మాత్రమే. యాదవ కార్పొరేషన్ ని వైసీపీ నిర్వీర్యం చేశారు. ఒక్క గొర్రె కొనడానికి రుణం ఇవ్వలేదు. పాడి పరిశ్రమను నాశనం చేశారు. గోపాల మిత్ర వ్యవస్థను చంపేశారు.  టిడిపి హయాంలో గొర్రెల కొనడానికి రుణాలు ఇచ్చాం. ఇన్స్యూరెన్స్ కల్పించాం.  పాడి పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చింది టిడిపి ప్రభుత్వం. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే యాదవులను అన్ని విధాలా ఆదుకుంటాం. గొర్రెలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం, పాడి పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తాం. యాదవ కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం.

యాదవ సామాజికవర్గీయులు మాట్లాడుతూ…

యాదవులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ముఖ్యమైన పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. వైసిపి పాలనలో యూనివర్సిటీ వీసి పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. యాదవ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు. పాడి పరిశ్రమకు జగన్ ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. గొర్రెల కొనుగోలుకు రుణాలు ఇవ్వడం లేదు. ఇన్స్యూరెన్స్ కూడా ఇవ్వడం లేదు.  టిడిపి హయాంలో మాకు గొర్రెల మేపడం కోసం ఇచ్చిన 5 ఎకరాల పచ్చిక భూముల్ని వైసిపి నాయకులు లాక్కున్నారు. యాదవ కార్పోరేషన్ ద్వారా ఒక్క రుణం కూడా ఇవ్వలేదని తెలిపారు. రాయలసీమలో యాదవులకు అన్నిరంగాల్లో ప్రాధాన్యతనిస్తానని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. రాజ్యసభ సీట్లలో కోటా పెంచాలి. యూనివర్శిటీ వీసీ, రిజిస్ట్రార్ల  నియామకాల్లోనూ మా సామాజికవర్గానికి న్యాయం చేయాలి. అనంతపురంజిల్లా, రాప్తాడు నియోజకవర్గంలో మా సామాజికవర్గం ఫ్యాక్షనిజానికి బలైపోయిన కుటుంబాలను ఆదుకోవాలి.

యాదవులతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:

రామ్మోహన్ యాదవ్: వైసీపీ పాలనలో యాదవులపై దాడులు పెరిగాయి. మాకు రక్షణ కల్పించేందుకు ఎస్సీ,ఎస్టీ చట్టం వంటి చట్టాన్ని తీసుకురావాలి. పాడిపరిశ్రమలో మమ్మల్ని ప్రోత్సహించేందుకు రూ.5లక్షలు సబ్సిడీలు ఇప్పించాలి.

బాలాంజనేయయాదవ్: మా జిల్లాలో గొర్రెల పెంపకం ప్రధానవృత్తి. మాకు గత పాలనలో సబ్సిడీ రుణాలు మంజూరయ్యాయి. వైసీపీ పాలనలో ఒక్క లోను కూడా రాలేదు. పచ్చికబయళ్ల కోసం టీడీపీ పాలనలో 5ఎకరాల భూములు ఇచ్చారు. వైసీపీ పాలనలో ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం లాక్కున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సీ-ఫామ్ భూమి 600ఎకరాల్లో లే అవుట్లు వేస్తున్నారు. దాన్ని ఆపి మా జీవనాధారాన్ని కాపాడాలి.

రామకృష్ణయాదవ్: టీటీడీలో శాశ్వత సభ్యత్వం మాకు ఇవ్వాలి. సన్నిధిగొల్ల పదవికి చట్టబద్ధతనివ్వాలి. యాదవ కార్పొరేషన్ ద్వారా ప్రతియేటా రూ.1,000కోట్లు మంజూరు చేసి మాకు సబ్సిడీలోన్లు ఇప్పించాలి.

యువనేతను కలిసిన ఇటుక తయారీ కార్మికులు

పెనుకొండ నియోజకవర్గం మల్లాపల్లిలో ఇటుక తయారీ కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. మల్లాపల్లి గ్రామంలో 20 ఇటుకబట్టీలు ఉన్నాయి. వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. చెరువుకుంటలో ఉచితంగా మట్టి తోలుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వాలి. ఇటుకలు బట్టీలకు అవసరమైన బొగ్గునిమిత్తం కట్టెలు కొట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఇటుకలబట్టీల వద్ద షెడ్ల నిర్మాణానికి బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు మంజూరుచేయాలి.

*యువనేత లోకేష్ స్పందిస్తూ…*

నిర్మాణరంగంలో కీలకంగా ఉన్న ఇటుకల తయారీ కార్మికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తాం. ఇటుకల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. ఇటుకల తయారీకి అవసరమైన గ్రామీణ చెరువుల్లో ఉచితంగా మట్టితోలుకోవడానికి, కట్టెలు కొట్టుకోవడానికి ఉచితంగా అనుమతులు ఇస్తాం.

యువనేతను కలిసిన సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అసోసియేషన్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. 2019 ఎన్నికలకు పాదయాత్రలో  ప్రస్తుత ముఖ్యమంత్రి సిపిఎస్ రద్దుపై అనేకసార్లు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ పాధ్యాయులందరిని నట్టేట ముంచారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న మాపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి పాఠశాలల విలీనం పేరుతో ఉన్న పోస్టులను తగ్గించేస్తున్నారు. బోధనకు ఆటంకం కలిగించేలా దాదాపుగా 15 యాప్ లను బలవంతంగా మాపై రుద్దుతున్నారు. మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పి రివర్స్ పి ఆర్ సి ఇచ్చి మాకు తీవ్ర అన్యాయం చేశారు. పి అర్ సి, డీఏ బకాయిలు, సిపిఎస్ రద్దుపై గొంతెత్తి అడిగితే వేధింపులకు దిగుతున్నారు. ఆర్జిత సెలవులు మినహాయించుకున్న ఉద్యోగులకు ఇప్పటివరకు నగదు కేటాయించకపోగా, ఆ మొత్తానికి కూడా ఇన్కమ్ టాక్స్ కట్టించుకున్నారు. రిటైరైన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు నెలల తరబడి పెండింగ్ లో పెట్టారు. పిఆర్ సి బకాయిలు, ఎపిజిఎల్ఐ, పిఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. నాడు-నేడు వంటి బోధనేతర పనులను ఉపాధ్యాయులకు అప్పగించి తీవ్రవత్తిడికి గురిచేయడంతో ఎంతోమంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా సమయంలో చనిపోయిన అనేకమంది ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకు కారుణ్య నియామకాలు కూడా పూర్తిస్థాయిలో జరగడం లేదు. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాల కోసం ప్రైవేటు అప్పలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. బైజూస్ కంటెంట్ పెట్టి, విద్యార్థుల సిలబస్ను పూర్తిస్థాయిలో కంప్లీట్ అవ్వకుండా చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న సిపిఎస్ ను రద్దుచేసి పాత ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలి. విద్యాబోధనకు తీవ్ర ఆటంకంగా ఉన్న యాప్ ల బాధ్యతను టీచర్లనుంచి తప్పించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ….*

డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. దేశచరిత్రలో ఉపాధ్యాయులను మద్యం షాపులవద్ద కాపలా పెట్టింది వైసీపీ ప్ర‌భుత్వం మాత్రమే. పాఠశాలల్లో టీచర్లకు పోలీసులను కాపలాపెట్టి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు చెల్లించలేని ప్రభుత్వం… రకరకాల సాకులతో వారిని ఇబ్బందులకు గురిచేయడం దారుణం. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ 43శాతం ఫిట్ మెంట్ తో పిఆర్ సి ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడుది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసే ఉద్యోగులు, భావిభారత పౌరులను తయారుచేసే టీచర్లు తమ డిమాండ్ల కోసం చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం. ఎటువంటి కక్షసాధింపు, వేధింపులకు తావీయకుండా స్వేచ్చగా విధులు నిర్వహించే వాతావరణం కల్పిస్తాం.

*యువనేత పాదయాత్రకు న్యాయవాదుల సంఘీభావం*

పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రం క్రాస్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా న్యాయవాదులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. రాయలసీమ ప్రాంత కక్షిదారులకు సౌలభ్యంగా ఉండేలా ఈ ప్రాంతంలో  హైకోర్టు బెంచి ఏర్పాటుచేయాలి. ప్రతినెలా యువన్యాయవాదులకు ఇస్తున్న రూ.5వేల భృతితోపాటు… రాయితీపై లా పుస్తకాలను అందించే ఏర్పాటుచేయాలి. న్యాయవాదులకు 4సెంట్ల ఇంటిస్థలాన్ని కేటాయించి, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి. పెరిగిన జనాభా, కక్షిదారులను దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గంలో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణాన్ని చేపట్టాలి. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలి. బిసి, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా న్యాయవాదులకు వ్యక్తిగత లోన్లు ఇచ్చేలా చట్టం తేవాలి. బార్ అసోసియేషన్లకు ప్రభుత్వం ద్వారా ఫర్నీచర్ అందించే ఏర్పాటుచేయాలి. న్యాయవాదులు చట్టసభలు, స్థానిక సంస్థల్లో పోటీచేసే అవకాశం కల్పించాలి. జిల్లాకో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేసి మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయనిపుణులచే శిక్షణాతరగతులు  నిర్వహించాలి. మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్ రూమ్ లు, ఆర్థిక చేయూత అందించడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయవ్యవస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టులోని కప్పు కాఫీ దొరికే పరిస్థితిలేదని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువ న్యాయవాదుల నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం, న్యాయవాదులకు రాయితీపై ఇళ్లస్థలాలు కేటాయిస్తాం.

యువనేతను కలిసిన ఎస్టీ సామాజికవర్గీయులు

పెనుకొండ నియోజకవర్గం మిషన్ తండాలో పాలసముద్రం ఎస్టీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వం పాలసముద్రంలో ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు 5ఎకరాల స్థలం కేటాయించగా, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గోరంట్ల మండలంలో 22 గిరిజన తండాలు ఉండగా, ఏ తండాకు బస్సు, రహదారి సౌకర్యం లేదు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతీయువకులకు ఎటువంటి నిధులు అందడంలేదు.  ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీచేయాలి. ఎస్టీ పేదలకు ఇళ్లపట్టాలు, ఇళ్లు మంజూరు చేయలి. ఎయిర్ బస్ కంపెనీ కోసం పాలసముద్రం చుట్టుపక్కల గిరిజన రైతులు భూములు కోల్పోయాం. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. గిరిజనులు సాగుచేసుకుంటున్న ఎసైన్డ్ భూముల్లో డి.పట్టాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

గత ప్రభుత్వ హయాంలో ఎస్టీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి తీరని అన్యాయం చేసింది. ఎస్టీల సంక్షేమానికి మాత్రమే ఖర్చుచేయాల్సిన రూ.5,355 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసిపి ప్రభుత్వం ఇతర పథకాలకు దారి మళ్లించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎస్టీ కార్పొరేషన్ ను నిధులు కేటాయించి బలోపేతం చేస్తాం. మారుమూల గిరిజన తండాలకు బస్, రహదారి సౌకర్యాలు కల్పిస్తాం. గిరిజనుల సంక్షేమానికి పాటుపడే చంద్రన్నను ముఖ్యమంత్రి చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.

Also, read this blog: Nara Lokesh’s Uplifting Voyage in Yuvagalam

Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *